‘భారత్‌తో డబ్యూటీసీ వద్దు.. యాషెస్‌ పెట్టండి’

7 May, 2020 11:34 IST|Sakshi

ప్రేక్షకుల్ని రంజింప  చేసే సిరీస్‌లు అవసరం

 టెస్టు చాంపియన్‌షిప్‌ కొంతకాలం ఆపండి

టీమిండియా-పాకిస్తాన్‌ల సిరీస్‌ నిర్వహించండి: హాగ్‌

సిడ్నీ: కరోనా వైరస్‌ సంక్షోభం ముగిసిన తర్వాత కొంతకాలం పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్యూటీసీ)ను నిలిపివేయాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ విన్నవించాడు. ఎటువంటి మజా లేని టెస్టు చాంపియన్‌షిప్‌ను కొన్ని రోజులు ఆపేస్తే మంచిదన్నాడు. ఆ స్థానంలో ఆసక్తికర సిరీస్‌లను రీషెడ్యూల్‌ చేయాలంటూ అంతర్జాతీయ  క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ‘ ప్రేక్షకులు పోటీ క్రికెట్‌ను కోరుకుంటున్నారు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే చాలా క్రికెట్‌ వృథా అయ్యింది. దాంతో టెస్టు చాంపియన్‌షిప్‌కు కూడా బ్రేక్‌ ఇవ్వండి. టెస్టు చాంపియన్‌షిప్‌ జరగాల్సిన మ్యాచ్‌ల  స్థానంలో కాంపిటేటివ్‌ క్రికెట్‌ను నిర్వహించండి. ఈ సీజన్‌ చివరలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌  రావాల్సి ఉంది. ఇది టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమే. అయితే ఈ సిరీస్‌ వద్దు.. దాని స్థానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ల యాషెస్‌కు సన్నాహాలు చేస్తే మంచిది. అదే సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య టెస్టు సిరీస్‌ను కూడా ఏర్పాటు చేయండి.  నాలుగు టెస్టుల సిరీస్‌ను ఏర్పాటు చేసి రెండు టెస్టులు భారత్‌లో ,మరో రెండు టెస్టులు పాకిస్తాన్‌లో జరిగేలా షెడ్యూల్‌ను రూపొందించండి. (‘ఆసీస్‌తో టీమిండియాను పోల్చలేం’)

ఇంగ్లండ్‌-ఆసీస్‌ల యాషెస్‌ సిరీస్‌తో పాటు భారత్‌-పాకిస్తాన్‌ల సిరీస్‌లు  ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. కోవిడ్‌-19 సంక్షోభం తర్వాత ప్రేక్షకుడి సరైన క్రికెట్‌ను అందించాలంటే ఇదొక్కటే మార్గం. అభిమానులకు మరింత వినోదం పంచాలంటే పోటీ క్రికెట్‌ చాలా అవసరం. ఇక్కడ టెస్టు చాంపియన్‌షిప్‌ను వాయిదా వేసి ప్రేక్షకుడి కోణంలో ఆలోచించండి’ అని హాగ్‌ పేర్కొన్నాడు. అంతకుముందు పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా భారత్‌-పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహించాలనే కోరిన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా నిధుల సేకరణకు భారత్‌-పాక్‌ల సిరీస్‌ ఒక్కటే మార్గమన్నాడు. దీనిని భారత దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌ అప్పుడే ఖండించాడు. నిధుల సేకరణ కోసం భారత్‌-పాక్‌ల సిరీస్‌ల జరపాలన్న అక్తర్‌ ప్రతిపాదన ఎంతమాత్రం సరికాదన్నాడు. అసలు అవసరమే లేదని కపిల్‌ తేల్చిచెప్పాడు. కాగా, భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఒక ద్వైపాక్షిక సిరీస్‌ జరిగి దాదాపు ఏడేళ్లు అవుతుంది. 2012-13 సీజన్‌లో ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో చివరిసారి తలపడ్డాయి. ఆపై ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు కారణంగా క్రికెట్‌ సిరీస్‌లకు బ్రేక్‌ పడింది. (‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’)

మరిన్ని వార్తలు