రంగంలోకి మరో వీరేంద్రుడు..

9 Apr, 2019 14:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ అంటే తెలియని వారుండరు. అతడు క్రీజ్‌లో ఉంటే బౌలర్లకు ముచ్చెమటలు పట్టేవి.. వీరేంద్రుడి వీర బాదుడికి బలైన బౌలర్లెందరో ఉన్నారు. సెహ్వాగ్‌ ఆటకు సెలవు ప్రకటించాక అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. కాని మళ్లీ ఇన్నాళ్లకు  సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను గుర్తు చేస్తూ..అతని వారసుడొచ్చాడు. ఆ సంచలనం పేరే పృథ్వీ షా.. సెహ్వాగే మళ్లీ ఆడుతున్నడా ? అన్నట్లు తలపించే అతని ఆటతీరు ప్రముఖ క్రికెట్‌ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

పృథ్వీ షా బ్యాటింగ్‌ చేసే తీరు, అతని టెక్నిక్‌ సెహ్వాగ్‌ను గుర్తుచేస్తున్నాయని, ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా తాను ఆడే విధానం అద్భుతంగా ఉందని ప్రముఖ క్రికెట్‌ దిగ్గజం, విండీస్‌ మాజీ కెప్టెన్‌  బ్రియన్‌ లారా కొనియాడారు. పృథ్వీ షా, ఆడిన తొలి టెస్ట్‌లోనే చాలా పరుగులు చేశాడు. ఈ యంగ్‌ ప్లేయర్‌ భారత గడ్డ మీద చాలా బాగా ఆడాడు. అతని వయస్సు 19 సంవత్సరాలే అయినప్పటికీ.. ఐపీఎల్‌లో గత రెండు సీజన్‌ల నుంచి ఆడుతున్నందు వల్ల బాగా అనుభవం సంపాదించాడని ప్రశంసించారు. తన మీద ఉన్న అంచనాలకు తగ్గట్లు, జట్టు అవసరాల మేరకు పృథ్వీషా రాణిస్తాడని బ్రియన్‌ లారా ఆశాభావం వ్యక్తం చేశారు. పృథ్వీషా గత ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ ద్వారా ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో పృథ్వీ సెంచరీ చేయడం లారాను ఎంతగానో ఆకట్టుకుంది. అతని నాయకత్వంలోనే 2018లో అండర్‌-19 భారత జట్టు నాలుగోసారి వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మరిన్ని వార్తలు