కాంస్య పతక పోరుకు భారత జట్లు

24 May, 2019 00:54 IST|Sakshi

అంటాల్యా (టర్కీ): ఈ ఏడాది ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లలో తొలి పతకానికి భారత జట్లు విజయం దూరంలో ఉన్నాయి. ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో మహిళల, పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లలో భారత జట్లు కాంస్య పతక పోరుకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ, స్వాతి దుద్వాల్, ముస్కాన్‌ కిరార్‌లతో కూడిన భారత బృందం షూట్‌ ఆఫ్‌లో రష్యా చేతిలో పరాజయం పాలైంది.

నిర్ణీత నాలుగు రౌండ్‌ల తర్వాత రెండు జట్లు 232–232 పాయింట్లతో సమంగా నిలిచాయి. షూట్‌ ఆఫ్‌లో భారత బృందం 29 పాయింట్లు సాధించగా... రష్యా 30 పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే కాంస్య పతక పోరులో బ్రిటన్‌తో భారత్‌ ఆడుతుంది. పురుషుల విభాగం సెమీఫైనల్లో రజత్‌ చౌహాన్, అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనిలతో కూడిన భారత జట్టు 233–234తో టర్కీ చేతిలో ఓటమి చవిచూసింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో రష్యాతో భారత్‌ తలపడుతుంది. 

మరిన్ని వార్తలు