వినోద్, బజరంగ్‌ ‘కంచు’మోత 

4 Mar, 2018 04:47 IST|Sakshi
వినోద్, బజరంగ్‌

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లు బజరంగ్‌ పూనియా (60 కేజీలు), వినోద్‌ కుమార్‌ ఓంప్రకాశ్‌ (70 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక బౌట్‌లలో బజరంగ్‌ 10–4తో యూనిస్‌ అలీఅక్బర్‌ (ఇరాన్‌)పై గెలుపొందగా... వినోద్‌ ఆతిథ్య దేశానికి చెందిన ఎలామన్‌ డాగ్‌డుర్‌బెక్‌ను ఓడించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో బజరంగ్‌ 5–7తో దైచి తకతాని (జపాన్‌) చేతిలో... వినోద్‌ 3–6తో నవ్రుజోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.

అయితే తకతాని, నవ్రుజోవ్‌ ఫైనల్‌కు చేరడంతో బజరంగ్, వినోద్‌లకు కాంస్య పతకాల కోసం నిర్వహించే రెప్‌చేజ్‌ రౌండ్‌లలో పోటీపడే అవకాశం లభించింది. రెప్‌చేజ్‌ తొలి రౌండ్‌లో బజరంగ్‌ 12–2తో అబ్దుల్‌ (తజికిస్తాన్‌)పై నెగ్గి కాంస్యం కోసం అలీఅక్బర్‌తో పోటీపడ్డాడు. వినోద్‌కు నేరుగా కాంస్యపతక బౌట్‌ ఆడే అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, రజతంతోపాటు ఆరు కాంస్యాలు లభించాయి.

మరిన్ని వార్తలు