వేలంలో ‘బ్లాక్‌ మాంబా’ టవల్‌కు భారీ ధర

30 Mar, 2020 19:46 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌:  ఈ ఏడాది జనవరిలో అమెరికా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌ ప్లేయర్‌  కోబీ బ్రయాంట్‌ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్‌ ప్రమాదంలో ఈ అమెరికన్‌ సూపర్‌స్టార్‌ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బ్రయాంట్‌తో పాటు అతని కూతురు 13 ఏళ్ల కుమార్తె జియానా కూడా మరణించింది. అయితే బ్లాక్‌ మాంబాగా పిలుచుకునే బ్రయాంట్‌ తరచు తన భుజాలపై వేసుకుని టవల్‌ను వేలంలో పెట్టగా దానికి భారీ ధర పలికింది.  బ్రయాంట్‌ మ్యాచ్‌ గెలిచిన సందర్భాల్లో ఎక్కువగా భుజాలపై వేసుకుని టవల్‌ను తాజాగా ఆన్‌లైన్‌ వేలంలో పెట్టారు. (క్షమాపణ చెప్పిన బీబీసీ)

ఇది చివరకు ఒక అభిమాని చేతుల్లోకి వెళ్లింది. ఆ టవల్‌ను 33 వేల డాలర్లు(రూ. సుమారు రూ. 24 లక్షలు) వెచ్చించి వూల్ఫ్‌ అనే ఒక అభిమాని కొనుగోలు చేశాడు. కాగా, 2016 ఏప్రిల్‌ 13వ తేదీన లేకర్స్‌ గేమ్‌కు ఉపయోగించిన రెండు టికెట్లను కూడా బ్రయాంట్‌ టవల్‌ను కొనుగోలు చేసిన అభిమాని అందుకున్నాడు. ఆనాటి మ్యాచ్‌లో బ్రయాంట్‌ 60 పాయింట్లు సాధించాడు. ఉతాహ్‌ జాజ్‌తో జరిగిన మ్యాచ్‌లో లేకర్స్‌ 101 పాయింట్లు సాధించింది. అందులో బ్రయాంట్‌ ఒక్కడే 60 పాయింట్లను నమోదు చేయడం విశేషం. అయితే తన వద్ద లేకర్స్‌ జట్టుకు చెందిన చాలా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నట్లు తెలిపాడు. వీటి కోసం దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో పెడతానన్నాడు. అదే తన చిరకాల కోరిక అని వూల్ఫ్‌ తెలిపాడు. (కోబీ మరణం నన్ను మార్చివేసింది: కోహ్లి)

మరిన్ని వార్తలు