విండీస్‌పై టీమిండియా ఘనవిజయం

26 Aug, 2019 03:11 IST|Sakshi

అంటిగ్వా : వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా విధించిన 419 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో  భారత పేస్‌ బౌలర్ల ధాటికి విండీస్‌ జట్టు 100 పరుగులకే కుప్పకూలింది. కాగా, విండీస్‌ తరపున కీమర్‌ రోచ్‌ (38, 31 బంతులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 7 పరుగులకే ఐదు వికెట్లు తీసి టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్‌ గణంకాలు నమోదు చేయగా, ఇషాంత్‌ శర్మ మూడు, షమి రెండు వికెట్లతో చెలరేగారు. 

అంతకు ముందు 343/7 పరుగుల వద్ద  టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో అర్థ శతకంతో ఆకట్టుకున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో మెరిసాడు. కాగా, హనుమ విహారి 93 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థశతకం, శతకంతో రాణించిన అజింక్యా రహానే మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా  ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ తమ భోణీని ఘనంగా ఆరంభించింది. ఇక కింగ్స్‌స్టన్‌ వేదికగా ఆగస్టు 30 నుంచి భారత్‌ - విండీస్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు