నాకు బుమ్రా ‘లైఫ్‌’ ఇచ్చాడు: పాక్‌ క్రికెటర్‌

27 May, 2019 15:38 IST|Sakshi

లండన్‌: టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన తప్పిదమే తనకి క్రికెటర్‌గా సుస్థిర జీవితానిచ్చిందని పాకిస్తాన్‌న్ బ్యాట్స్‌మన్ ఫకార్ జమాన్ వెల్లడించాడు. ఇంగ్లండ్ వేదికగా 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే బుమ్రా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్‌గా తేలడంతో ఫకార్ జమాన్‌కి లైఫ్‌ లభించగా.. అనంతరం చెలరేగిపోయిన అతను కెరీర్‌లో తొలి సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో పాటు పాకిస్తాన్‌కి భారీ స్కోరు అందించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 180 పరుగుల తేడాతో ఓడిపోగా.. పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో ఫకార్‌ జమాన్‌ 114 పరుగులు సాధించాడు.

దాని గురించి తాజాగా మాట్లాడిన ఫకార్‌ జమాన్‌..  ‘బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఆ ఫైనల్‌కి ముందు వరకూ నాకు నోబాల్‌‌‌లో ఔటవ్వాలనే డ్రీమ్ ఉండేది. అనూహ్యంగా అది నిజమైంది. భారత్‌పై మ్యాచ్‌లో బాగా ఆడతానని నా తల్లిదండ్రులకి అప్పటికే ప్రామిస్ చేశాను. దాంతో.. ఫైనల్లో తొలుత ఔట్‌ కాగానే చాలా బాధనిపించింది. అయితే అది నో బాల్‌ కావడంతో సెంచరీ చేశాను. భారత్‌పై సెంచరీ తర్వాత నేను బాగా ఫేమస్ అయిపోయాను. కానీ పేరు ప్రఖ్యాతలతో పాటు బాధ్యత కూడా పెరిగింది. గతంతో పోలిస్తే.. ఇప్పుడు పరిణతితో ఆడుతున్నా. ఇప్పుడు నా లక్ష్యం ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా ఆడటమే’ అని ఫకార్ జమాన్ వెల్లడించాడు. మే 30 నుంచి ప్రపంచకప్ మొదలుకానుండగా.. దాయాది దేశాల మధ్య మ్యాచ్ జూన్ 16న జరగనుంది.

ఇక్కడ చదవండి: ‘అది నో బాల్‌ కాకుంటే.. నా కథ ముగిసేది’

>
మరిన్ని వార్తలు