ఐపీఎల్‌ డబ్బు.. కుక్క కోసం!

24 Dec, 2019 12:46 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఇటీవల జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలంలో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ జాక్‌పాట్‌ కొట్టాడు.  కమ్మిన్స్‌ను రూ. 15.5 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. కమ్మిన్స్‌ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా అతనికి కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే కేకేఆర్‌ చివరి వరకు అతని కోసం వెళ్లి తమ పంతాన్ని నెగ్గించుకుంది. కమ్మిన్స్‌కు భారీ మొత్తం దక్కడంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కమ్మిన్స్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు.అయితే తనకు భారీ మొత్తంలో  నగదు లభించడంతో కమ్మిన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియడం లేదన్నాడు. కాకపోతే తన గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం ఐపీఎల్‌ డబ్బుతో ముందుగా తమ పెంపుడు కుక్కకు కొన్ని బొమ్మలు కొందామని చెప్పిందన్నాడు.

‘ నిజంగా ఆ నగదుతో  ఏం చేయాలో నాకు తెలీదు. ఏం చేయాలనేది కూడా ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం కుక్కకు ముందుగా కొన్ని బొమ్మలు తీసుకుందామని చెప్పింది. ఆమెకు  పెంపుడు  కుక్క అంటే చాలా ఇష్టం. దాంతో కుక్కకు ఏమి అవసరమో అవి తీసుకుందామని చెప్పింది’ అని కమ్మిన్స్‌ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తానని కమ్మిన్స్‌ చెప్పుకొచ్చాడు. ఇక్కడ తన బౌలింగ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఐపీఎల్‌ వంటి పెద్ద లీగ్‌లో ఆడటం ఒక అదృష్టం. నేను ఇంకా క్రికెట్‌ ఆడుతున్నానంటే ఆ గేమ్‌ను ఎక్కువగా ప్రేమించడమే’ అని తెలిపాడు.


 

>
మరిన్ని వార్తలు