‘వరల్డ్‌ ఫైనల్స్‌’ టోర్నీ నిర్వహణపై... 

12 Jul, 2020 02:45 IST|Sakshi

 చైనా నుంచి స్పష్టత కోరిన బీడబ్ల్యూఎఫ్‌

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ‘వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌’ నిర్వహణపై చైనా నుంచి మరింత స్పష్టత కోరినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో జరగాల్సిన ఈ టోర్నీకి చైనా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ (బీజింగ్‌) ట్రయల్స్‌ మినహా... షెడ్యూల్‌ చేసిన ఏ అంతర్జాతీయ టోర్నీకీ ఆతిథ్యమివ్వబోమని శుక్రవారం చైనా క్రీడా పరిపాలక మండలి ప్రకటించింది.

దీంతో గ్వాంగ్‌జౌ వేదికగా డిసెంబర్‌ 16–20 వరకు జరగాల్సిన వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీపై సందిగ్ధత నెలకొంది. చైనా తాజా నిర్ణయంతో ఈ ఏడాది బ్యాడ్మింటన్‌ క్యాలెండర్‌పై ఎలాంటి ప్రభావం పడనుందనే అంశంపై చైనీస్‌ బ్యాడ్మింటన్‌ సంఘం (సీబీఏ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. వరల్డ్‌ ఫైనల్స్‌తో పాటు చైనా ఓపెన్‌ సూపర్‌–1000 ఈవెంట్‌ (సెప్టెంబర్‌ 15–20, చాంగ్‌జౌ), ఫుజు చైనా ఓపెన్‌ సూపర్‌–750 (నవంబర్‌ 3–8) టోర్నీలు కూడా చైనాలోనే జరుగనున్న నేపథ్యంలో వీటి భవిష్యత్‌పై కూడా బీడబ్ల్యూఎఫ్‌ వివరణ కోరింది.

మరిన్ని వార్తలు