నాదల్‌ రికార్డుపై జొకోవిచ్‌ గురి 

5 Mar, 2019 01:25 IST|Sakshi

కాలిఫోర్నియా (అమెరికా): వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించి జోరు మీదున్న ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) మరో మేటి టైటిల్‌పై గురి పెట్టాడు. గురువారం మొదలయ్యే సీజన్‌ తొలి మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నమెంట్‌ ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే కెరీర్‌లో 32 మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన ఈ సెర్బియా స్టార్‌ మరో టైటిల్‌ నెగ్గితే... అత్యధికంగా 33 మాస్టర్స్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. అయితే మేటి క్రీడాకారులందరూ పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జొకోవిచ్‌ విజేతగా నిలవాలంటే మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. రాఫెల్‌ నాదల్, ఫెడరర్, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), నిషికోరి (జపాన్‌), కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా), జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా), యువతార సిట్సిపాస్‌ (గ్రీస్‌), డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) తదితరులు కూడా ఈ టోర్నీ టైటిల్‌ రేసులో ఉన్నారు.  

తొలి రౌండ్‌లో సాకేత్‌ పరాజయం 
సాక్షి, హైదరాబాద్‌: జుహై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌ 4–6, 6–4, 4–6తో ఎన్రిక్‌ లోపెజ్‌ పెరెజ్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ ఎనిమిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.   

మరిన్ని వార్తలు