హైదరాబాద్‌ హంటర్స్‌ శుభారంభం

25 Dec, 2017 03:59 IST|Sakshi

గువాహటి: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. కొత్త జట్టు నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 5–2తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో మార్కిస్‌ కిడో–యు యోన్‌ సియోంగ్‌ (హంటర్స్‌) ద్వయం 15–10, 13–15, 15–13తో కిమ్‌ జి జంగ్‌–షిన్‌ బేక్‌ జోడీపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో లీ హున్‌ ఇల్‌ (హంటర్స్‌) 15–13, 11–15, 15–6తో అజయ్‌ జయరామ్‌ను ఓడించాడు. ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా ఎంచుకున్న మూడో మ్యాచ్‌లో కరోలినా మారిన్‌ 15–9, 15–11తో మిచెల్లి లీపై గెలిచింది.

దాంతో హంటర్స్‌ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా ఎంచుకున్న నాలుగో మ్యాచ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ ప్లేయర్‌ జు వీ వాంగ్‌ 11–15, 15–6, 15–6తో సాయిప్రణీత్‌ను ఓడించడంతో వారియర్స్‌ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. చివరిదైన ఐదో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–పియా జెబాదియా ద్వయం 15–8, 15–11తో ప్రాజక్తా సావంత్‌–షిన్‌ బేక్‌ జంటపై నెగ్గడంతో హంటర్స్‌ జట్టు ఓవరాల్‌గా 5–2తో విజయం దక్కించుకుంది. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడుతుంది.  

మరిన్ని వార్తలు