కంగ్రాట్స్ సింధు.. గో ఫర్ గోల్డ్

19 Aug, 2016 15:45 IST|Sakshi
కంగ్రాట్స్ సింధు.. గో ఫర్ గోల్డ్

రియో ఒలింపిక్స్లో రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం గెలవడం, ఆ వెంటనే తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్కు చేరి రజతం ఖాయం చేసుకోవడంతో భారత క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పతకాలు తీసుకువస్తారని భావించిన స్టార్ క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరగడంతో నిరాశపడ్డ అభిమానులకు తాజా విజయాలు అమితానందం కలిగిస్తున్నాయి. ఇప్పుడు అభిమానుల మూడ్ మారింది. దేశంలో ఎక్కడ చూసినా బ్యాడ్మింటన్ ఫీవరే. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల వరకు అందరి నోటా సింధు మాటే. శుక్రవారం సాయంత్రం జరిగే ఫైనల్లో సింధు గెలవాలన్నది అందరి ఆకాంక్ష. అభిమానులు సింధు గెలవాలని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు.

ఈ రోజు సాయంత్రం ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్, సింధుల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఆమె విజయం కోసం దేశం యావత్తూ ప్రార్థిస్తోంది. సింధు గెలవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, మాధురీ దీక్షిత్, కరణ్ జోహార్, ఆశీష్ చౌదరి, నందితా దాస్, మాధుర్ బండార్కర్.. సింధుకు అభినందలు తెలిపారు. కంగ్రాట్స్ సింధు.. గో ఫర్ గోల్డ్.
 

మరిన్ని వార్తలు