శతకాలతో కదం తొక్కారు..

1 Dec, 2019 11:08 IST|Sakshi

హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు రోరీ బర్న్స్‌(101), జో రూట్‌(114 బ్యాటింగ్‌)లు సెంచరీలతో కదం తొక్కారు. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను రోరీ బర్న్స్‌- జో రూట్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 177 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ గాడిలో పడింది. ఈ క్రమంలోనే రోరీ బర్న్స్‌ సెంచరీ సాధించాడు. అనంతరం రూట్‌కు జత కలిసిన బెన్‌ స్టోక్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. కాగా, స్టోక్స్‌(26) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు.

సౌథీ బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై జాక్‌ క్రావ్లే(1) సైతం ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 262 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రూట్‌కు జతగా ఓలీ పాప్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో టిమ్‌ సౌథీకి రెండు వికెట్లు లభించగా, మ్యాట్‌ హెన్రీ, నీల్‌ వాగ్నర్‌లు తలో వికెట్‌ తీశారు. అంతకుముందు న్యూజిలాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 106 పరుగుల వెనుకబడి ఉంది.

మరిన్ని వార్తలు