భారత బౌలర్ల విజృంభణ

5 Jun, 2019 16:54 IST|Sakshi

సౌతాంప్టాన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్ల విజృంభణ కొనసాగుతోంది. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు తమదైన శైలిలో చెలరేగిపోతూ సఫారీలను కష్టాల్లోకి నెట్టారు. 89 పరుగులకే ఐదు సఫారీ వికెట్లను నేలకూల్చారు. సఫారీ ఓపెనర్లు హషీమ్‌ ఆమ్లా-డీకాక్‌లను బుమ్రా ఔట్‌ చేయగా,  వాన్‌ డెర్‌ డస్సెన్‌-డుప్లెసిస్‌లను చహల్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆపై జేపీ డుమినీని కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా నాల్గో ఓవర్‌ రెండో బంతిని బుమ్రా ఆఫ్‌ స్టంప్‌పై గుడ్‌ లెంగ్త్‌లో సంధించాడు. దానికి తడబడిన ఆమ్లా.. రోహిత్‌కు స్లిప్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను సెకండ్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో ఆమ్లా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు.

ఆపై డీకాక్‌ను సైతం బుమ్రా ఔట్‌ చేశాడు. ఆరో ఓవర్‌ ఐదో బంతికి డీకాక్‌ స్లిప్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ను థర్డ్‌ స్లిప్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి అందుకున్నాడు. ఇక 20 ఓవర్‌ మొదటి బంతికి డస్సెన్‌ను చహల్‌ బౌల్డ్‌ చేయగా, అదే ఓవర్‌ ఆఖరి బంతికి డుప్లెసిస్‌ను సైతం క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అటు తర్వాత 23 ఓవర్‌ చివరి బంతికి జేపీ డుమినీని కుల్దీప్‌ యాదవ్‌ వికెట్లు ముందు బోల్తా కొట్టించాడు. కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన డుమినీ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

మరిన్ని వార్తలు