ఒకేసారి 88 స్థానాలు ఎగబాకాడు..

11 Nov, 2019 16:16 IST|Sakshi

దుబాయ్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మొత్తంగా ఎనిమిది వికెట్లు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్న టీమిండియా పేసర్‌ దీపక్‌ చహర్‌ తన ర్యాంక్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. చివరి టీ20లో ఆరు వికెట్లు సాధించడంతో చహర్‌ ఒకేసారి 88 స్థానాలను ఎగబాకాడు. సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో చహర్‌ 42వ స్థానంలో నిలిచాడు.  బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో హ్యాట్రిక్‌ను కూడా సాధించి పొట్టి ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత బౌలర్‌గా వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఫలితంగా తన ర్యాంక్‌లో దూసుకుపోయాడు చహర్‌.

ఇక అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ విభాగంలో టాప్‌ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ మిచెల్‌ సాంత్నార్‌ కొనసాగుతున్నాడు.బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో  పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ టాప్‌ ర్యాంకులోనే ఉండగా,  భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఏడో స్థానాన్ని కాపాడుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆల్‌ రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ నబీ తొలిసారి నంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించాడు. ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం క్రికెట్‌ నుంచి తాత్కాలిక విరామం ప్రకటించడంతో అది నబీకి లాభించింది.

మరిన్ని వార్తలు