నువ్వే మా బుమ్రా..!

12 Nov, 2019 10:48 IST|Sakshi

నాగ్‌పూర్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరంగేట్రం మ్యాచ్‌ మొదలుకొని ఇప్పటివరకూ తన మార్కు బౌలింగ్‌తో దుమ్మురేపుతున్న బుమ్రా భారత జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు.  కాగా, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా గాయం కారణంగా తప్పుకోవడంతో దీపక్‌ చాహర్‌కు అవకాశం దక్కింది. తనకు వచ్చిన అవకాశాన్ని  మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌తో మరీ నిరూపించుకున్నాడు చాహర్‌. చివరి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గెలవడంతో పాటు మొత్తంగా ఎనిమిది వికెట్లతో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ను కూడా గెలుచుకున్నాడు.

అయితే బంగ్లాదేశ్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చాహర్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒకే ఒక్క విషయం చెప్పాడట. ‘కీలక ఓవర్లలో నువ్వు బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈరోజుకి నువ్వు మా బుమ్రావి అని రోహిత్‌ చెప్పాడు. ఆ మాటలే నాలో మరింత ప్రేరణ కల్గించాయి. నాపై పెట్టిన బాధ్యతను ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను. ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా నా వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ఎందుకంటే అవతల వ్యక్తి నమ్మకాన్ని మనం ఎప్పుడూ వమ్ము చేయకూడదు. నిజంగా మనం వారి నమ్మకాన్ని నిలబెట్టకపోతే మనలో మనకే చెడు భావన కల్గుతుంది. ఈ క్రమంలోనే నువ్వే మా బుమ్రా అని కెప్టెన్‌ రోహిత్‌ భాయ్‌ చెప్పిన మాటలు నాలో మరింత బాధ్యతను పెంచాయి’ అని చాహర్‌ చెప్పుకొచ్చాడు.

>
మరిన్ని వార్తలు