టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

19 Dec, 2019 19:56 IST|Sakshi

కటక్‌: ఇప్పటికే గాయాల బారిన పడి పలువురు టీమిండియా స్టార్‌ క్రికెటర్లు వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరమైతే ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌.. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డేకు దూరమయ్యాడు. విశాఖలో జరిగిన రెండో వన్డేలో వెన్నుగాయంతో సతమతమైన చాహర్‌.. చివరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదని టీమిండియా మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. మహ్మద్‌ షమీతో కలిసి బౌలింగ్‌ పంచుకుంటున్న చాహర్‌ లేకపోవడం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.

కాగా, చాహర్‌ స్థానంలో నవదీప్‌ షైనీని ఎంపిక  చేసినట్లు సెలక్షన్‌ కమిటీ పేర్కొంది. ‘ రెండో వన్డేలో చాహర్‌ను వెన్నుగాయం వేధించింది. దాంతో అతన్ని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పరీక్షించి విశ్రాంతి అవసరమని చెప్పింది. ఈ క్రమంలోనే చాహర్‌కు చివరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. చాహర్‌ స్థానంలో మరో యువ పేసర్‌ షైనీ జట్టులో  ఎంపిక చేశాం’ అని సెలక్షన్‌ కమిటీ తెలిపింది. ఆదివారం కటక్‌లో భారత్‌-విండీస్‌ జట్ల మధ్య తుది వన్డే  జరుగనుంది.

భారత మూడో వన్డే జట్టు ఇదే..

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌,  శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శివం దూబే, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ షైనీ

>
మరిన్ని వార్తలు