మాజీ క్రికెటర్ పై ఛీటింగ్ కేసు

18 Jul, 2015 15:22 IST|Sakshi
మాజీ క్రికెటర్ పై ఛీటింగ్ కేసు

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్‌పై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. వివరాలు... శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అర్షద్ అయూబ్ మరికొందరితో కలిసి స్కైటీ పేరుతో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టి వాటిని పలువురికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2007లో ప్రారంభించిన ఈ వెంచర్ ఇప్పటికీ పూర్తి కాకపోవటంతో పీజీకే నాయర్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కోర్టును  ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాల మేరకు మియాపూర్ పోలీ సులు అర్షద్ అయూబ్‌పై ఐపీసీ 406,409,415, 420,464,468,470,471,506 రీడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 20 నెలల్లో పూర్తి చేస్తామని కొనుగోలుదార్ల నుండి డబ్బులు తీసుకున్న అయూబ్ ఐదేళ్లైనా పని పూర్తి చేయలేదని, 6,7 అంతస్తులకు అనుమతులు లేకుండానే విక్రయించాడని, ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించాడని నాయర్ ఫిర్యాదు చేశారు. నాయర్ తరహాలోనే మరో ఏడుగురు అయూబ్   చేతిలో మోస పోయామని మియాపూర్ పోలీసులను   ఆశ్రయించారు.
 

మరిన్ని వార్తలు