చెన్నై స్మాషర్స్‌ గెలుపు  

28 Dec, 2017 00:28 IST|Sakshi

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌  

న్యూఢిల్లీ: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–3)లో చెన్నై స్మాషర్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇక్కడి సిరి ఫోర్ట్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన ఈ పోరులో చెన్నై 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. చెన్నై తరఫున స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు 12–15, 15–7, 15–9తో బీవెన్‌ జంగ్‌ (ముంబై)పై గెలుపొందగా, అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌ పురుషుల డబుల్స్‌లో యంగ్‌ లీ–సుమిత్‌ రెడ్డి జంట 9–15, 6–15తో లీ యంగ్‌ డే– బూన్‌ హియోంగ్‌ తన్‌ (ముంబై) జోడీ చేతిలో కంగుతింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో బ్రిస్‌ లెవెర్‌డెజ్‌ 15–14, 10–15, 15–14తో సమీర్‌ వర్మ (ముంబై)పై చెమటోడ్చి నెగ్గాడు. రెండో పురుషుల సింగిల్స్‌ పోరును ముంబై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది.

ఇందులో సన్‌ వాన్‌ హో (ముంబై) 15–11, 15–5తో తనోంగ్సక్‌ సాన్సొంబున్సుక్‌పై గెలుపొందడంతో ముంబై 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. తదుపరి మిక్స్‌డ్‌ డబుల్స్‌ చెన్నైకి ట్రంప్‌ మ్యాచ్‌ కాగా... కీలకమైన ఈ పోరులో గ్యాబ్రియెల్ల అడ్‌కాక్‌– క్రిస్‌ అడ్‌కాక్‌ జంట 15–9, 13–15, 15–9తో అర్జున్‌– గ్యాబ్రియెల్ల స్టొయెవా జోడీపై నెగ్గి చెన్నైని గెలిపించింది. నేడు (గురువారం) జరిగే పోరులో ఢిల్లీ డాషర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్‌ తలపడుతుంది.   

మరిన్ని వార్తలు