సెమీస్‌లో నార్త్‌ ఈస్టర్న్, చెన్నై సూపర్‌ స్టార్స్‌ 

2 Feb, 2020 04:27 IST|Sakshi

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో చెన్నై సూపర్‌ స్టార్స్, నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ స్టార్స్‌ 4–3తో అవధ్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. దాంతో 19 పాయింట్లు సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమంగా ఉన్న సమయంలో... విజేతను నిర్ణయించే మ్యాచ్‌ అయిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–జెస్సికా (చెన్నై) ద్వయం 15–11, 13–15, 15–14తో క్రిస్టీనా–కొ సుంగ్‌ హ్యూన్‌ (అవధ్‌) జంటపై అద్భుత విజయాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ 5–0తో పుణే సెవెన్‌ ఏసెస్‌పై ఘనవిజయం సాధించింది. దాంతో 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలవడంతో పాటు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. నేటి మ్యాచ్‌లో ముంబై రాకెట్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు