చిక్కరంగప్ప జట్టుకు టైటిల్‌

11 Feb, 2019 10:10 IST|Sakshi

గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (పీజీటీఐ) గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో బెంగళూరు ప్లేయర్‌ చిక్కరంగప్ప మరోసారి మెరిశాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ (హెచ్‌జీసీ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్‌ కేటగిరీలో చాంపియన్‌గా నిలిచిన చిక్కరంగప్ప... టీమ్‌ విభాగంలోనూ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రో–ఆమ్‌ ఈవెంట్‌లో అమెచ్యూర్‌ గోల్ఫర్లు అనిల్‌ యామాని, ఆదిత్య జంవాల్, కె. పృథ్వీరెడ్డిలతో జతకట్టిన ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌ చిక్కరంగప్ప బృందం 52.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

నోయిడాకు చెందిన ప్రొఫెషనల్‌ ప్లేయర్‌ అమర్‌దీప్‌ మలిక్‌ బృందం రన్నరప్‌గా నిలిచింది. అమెచ్యూర్‌ క్రీడాకారులు చక్రవర్తి, ఓంప్రకాశ్‌ మోదీ, భీమరాజులతో కూడిన అమర్‌దీప్‌ జట్టు 52.8 పాయింట్లు స్కోర్‌ చేసి రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఈవెంట్‌లో 300 యార్డ్స్‌ దూరం నుంచి 14వ హోల్‌ను పూర్తి చేసిన విరాట్‌ రెడ్డి షాట్‌ ‘లాంగెస్ట్‌ డ్రైవ్‌’గా ఎంపికైంది. అబ్రహం సంధించిన షాట్‌ ‘క్లోజెస్ట్‌ పిన్‌’గా నమోదైంది. పోటీల్లో భాగంగా అతను కొట్టిన షాట్‌ నిర్దేశించిన పిన్‌కు అతి సమీపంగా (1 అడుగు 3 ఇంచుల దూరంలో) పడింది. కె. శశిధర్‌ రెడ్డి కొట్టిన షాట్‌ ‘స్ట్రెయిటెస్ట్‌ డ్రైవ్‌’గా ఎంపికైంది.

మరిన్ని వార్తలు