సాత్విక్‌–అశ్విని జంట సంచలనం 

20 Sep, 2018 01:32 IST|Sakshi

 ప్రపంచ 12వ ర్యాంక్‌ జోడీపై గెలుపు

శ్రీకాంత్‌ శుభారంభం

చైనా ఓపెన్‌ టోర్నీ  

చాంగ్జౌ (చైనా): అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో భారత జోడీ మరో సంచలనం సృష్టించింది. చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప ద్వయం ప్రపంచ 12వ ర్యాంక్‌ జోడీ లారెన్‌ స్మిత్‌–మార్కస్‌ ఇలిస్‌ (ఇంగ్లండ్‌)ను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 25వ ర్యాంక్‌ జంట సాత్విక్‌–అశ్విని 21–13, 20–22, 21–17తో ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం నెగ్గిన లారెస్‌ స్మిత్‌–మార్కస్‌ ఇలిస్‌ జోడీని ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.  గతంలో ఈ జంటతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన భారత జోడీ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూడటం విశేషం. అయితే పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 19–21, 20–22తో గో వీ షెమ్‌–తాన్‌ వీ కియోంగ్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్పప్ప ద్వయం 10–21, 18–21తో కిమ్‌ సో యోంగ్‌–కాంగ్‌ హీ యోంగ్‌ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. 

ప్రణయ్‌ పరాజయం 
పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–9, 21–19తో రాస్ముస్‌ జెమ్కే (డెన్మార్క్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 16–21, 12–21తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో పీవీ సింధు; సుపన్యు అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)తో శ్రీకాంత్‌; జెంగ్‌ సివె–హువాంగ్‌ యాకియోంగ్‌ (చైనా)లతో సాత్విక్‌–అశ్విని; మథియాస్‌ క్రిస్టియాన్సన్‌–క్రిస్టినా పెడర్సన్‌ (డెన్మార్క్‌)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా; చెన్‌ హంగ్‌ లింగ్‌–వాంగ్‌ చి లిన్‌ (చైనీస్‌ తైపీ)లతో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి తలపడతారు. 

►ఉదయం గం. 9.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం  

మరిన్ని వార్తలు