ఐపీఎల్‌కు ముందే కోల్‌కతాకు షాక్‌

21 Feb, 2018 17:01 IST|Sakshi
క్రిస్‌లిన్‌ (ఫైల్‌ ఫొటో)

గాయపడ్డ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌లిన్‌

నాయకత్వ పగ్గాలు అప్పగించే యోచనలో కోల్‌కతా

గాయంతో ఆందోళనలో కేకేఆర్‌ యాజమాన్యం

సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌ ప్రారంభం కాకముందే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌లిన్‌ గాయపడ్డాడు. అతనికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న కోల్‌కతా ఫ్రాంచైజీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు సార్లు కోల్‌కతాను టోర్నీ విజేతగా నిలబెట్టిన గంభీర్‌ను కాదని ​వేలంలో రూ. 9.6 కోట్లకు ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. 

అయితే ఈ విధ్వసంకర ఆటగాడు టీ20 ట్రైసిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో కివీస్ ఆటగాడు రాస్ టేలర్ ఆడిన  షాట్‌ బంతిని అందుకునేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతడి కుడిచేతి భుజానికి గాయం అయింది. వెంటనే క్రిస్‌లిన్‌ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయగా ఎడమ చేతి భుజం ఎముకకు గాయమైనట్లు గుర్తించారు. వారి సూచన మేరకు బ్రేస్ ధరించి లిన్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు.

గత ఐపీఎల్‌లో  బౌండరీ ఆపే ప్రయత్నంలో ఇదే తరహాలో గాయపడి తన ఎడమచేతి భుజానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. ఇప్పటికే క్రిస్‌లిన్‌ మొత్తం మూడుసార్లు తన ఎడమ భుజానికి  సర్జరీ చేయించుకున్నాడు. దీంతో దుబాయ్‌లో ప్రారంభం కాబోతున్న పాకిస్థాన్‌ ప్రిమీయర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)కు పూర్తి స్థాయిలో దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో క్రిస్‌లిన్‌ ఐపీఎల్‌ వరకు కోలుకుంటాడో లేదో అని కోల్‌కతా శిభిరంలో ఆందోళనలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు