సిన్సినాటి చాంప్స్‌ మెద్వదేవ్, కీస్‌

19 Aug, 2019 21:57 IST|Sakshi

సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్లో సరికొత్త చాంపియన్లు అవతరించారు. పురుషుల సింగిల్స్‌లో డేనియల్‌ మెద్వదేవ్‌(రష్యా), మహిళల సింగిల్స్‌లో మాడిసన్‌ కీస్‌(అమెరికా) ట్రోఫీలు ఎగరేసుకుపోయారు. సోమవారం జరిగిన తుదిపోరులో తొమ్మిదోసీడ్, వరల్డ్‌ నెం.5 మెద్వదేవ్‌ 7–6(7/3), 6–4తో 16వ సీడ్, 15వ ర్యాంకర్‌ డేవిడ్‌ గఫిన్‌(బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇది మెద్వదేవ్‌కు తొలి ఏటీపీ మాస్టర్స్‌ టైటిల్‌. కాగా, అద్భుత ఫామ్‌లో ఉన్న మెద్వదేవ్‌కు ఈ ఏడాది ఇది 43వ విజయం. అతని తర్వాతి స్థానంలో 41 విజయాలతో నాదల్‌(స్పెయిన్‌), 39 గెలుపులతో ఫెదరర్‌(స్విట్జర్లాండ్‌) ఉండడం విశేషం. మరోవైపు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో స్థానిక క్రీడాకారిణి మాడిసన్‌ కీస్‌నే విజయం వరించింది. తుదిపోరులో ఆమె 7–5, 7–6(7/5)తో స్వెత్లానా కుజ్‌నెత్సోవా(రష్యా)పై చెమటోడ్చి నెగ్గింది. ఇది కీస్‌కు కెరీర్‌లో ఐదో టైటిల్‌ కాగా, ఈ సీజన్‌లో రెండోది.

మరిన్ని వార్తలు