ముంబై:భారత క్రికెట్ కోచ్ను ఎంపిక చేయడానికి ఇంకా మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ లో కీలకమైన కోచ్ పదవిని సరైన వ్యక్తి చేతుల్లో పెట్టేందుకు మరికొంత సమయం వేచి చూడక తప్పదన్నాడు.
'భారత క్రికెట్ కోచ్ ఎంపికకు మరికొంత సమయం అవసరం కావొచ్చు. వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటన నాటికి కొత్త కోచ్ నియామకం జరుగుతుందా?లేదా?అనేది కచ్చితంగా చెప్పలేను. ఇప్పటికే కోచ్ పదవిపై కసరత్తులు చేస్తున్నాం. అది ఇంకా ఎంతో దూరంలో లేదు' అని గంగూలీ పేర్కొన్నాడు. జూన్ నెలలో జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు వెస్టిండీస్ టూర్ కు వెళ్లనుంది. విండీస్ తో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.