విరాట్ సేనకు పాక్ మాజీల ప్రశంసలు..

16 Jun, 2017 20:16 IST|Sakshi
విరాట్ సేనకు పాక్ మాజీల ప్రశంసలు..

కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరిన క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిదిలు హర్షం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తో జరిగిన సెమీస్ లో ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరిన విరాట్ సేనకు అభినందలు అంటూ అక్తర్ ట్వీట్ చేయగా, భారత్ జట్టు అమోఘంగా ఆడిందంటూ ఆఫ్రిది ప్రశంసించాడు.

'చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు అర్హత సాధించిన భారత్ కు కంగ్రాట్స్. మరోసారి పాకిస్తాన్ తో  మెగా గేమ్ కు టీమిండియా సిద్ధమైంది. ఇక్కడ పాక్ కు గుడ్ లక్. టైగర్స్ పై మీరు గెలిచినా, ఓడినా నేను మీతోనే ఉంటాను'అని అక్తర్ పేర్కొన్నాడు. ' భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇక క్రికెట్ లో అతి పెద్ద సమరమే మిగిలి ఉంది. భారత్ పై పాక్ గెలవాలంటే నిలకడ అవసరం'అని ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. తొలి సెమీస్ లో ఇంగ్లండ్ పై గెలిచిన పాకిస్తాన్ ఫైనల్ కు చేరగా, ఆ తరువాత బంగ్లాదేశ్ పై విజయం సాధించిన భారత జట్టు తుది సమరానికి సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ లో ఇది భారత్ కు వరుసగా రెండో ఫైనల్ కాగా, పాకిస్తాన్ కు మాత్రం ఇదే మొదటి ఫైనల్.

>
మరిన్ని వార్తలు