విజయంతో ముగింపు

14 Dec, 2019 02:13 IST|Sakshi

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సింధు గెలుపు

గ్రూప్‌ ‘ఎ’లో మూడో స్థానం

గెలుపుతో ప్రారంభించిన ఈ ఏడాదిని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సీజన్‌ను కూడా విజయంతోనే ముగించింది. అయితే ఈ సంవత్సరం ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్‌ టూర్‌ సూపర్‌ టోర్నమెంట్‌లలో ఆమె ఒక్క దాంట్లోనూ టైటిల్‌ సాధించలేకపోవడం కాస్త లోటుగా అనిపిస్తోంది. కానీ ఆగస్టులో స్విట్జర్లాండ్‌ ఆతిధ్యమిచ్చిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. విశ్వ వేదికపై సింధు సాధించిన ఈ గొప్ప విజయంతో మిగతా టోర్నీలలో ఆమె ప్రదర్శనలో నిలకడ లోపించినా అంతగా ఆందోళన కలిగించలేదు.  

గ్వాంగ్‌జౌ (చైనా): సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత పొందిన గత మూడు పర్యాయాల్లో కనీసం సెమీఫైనల్‌ చేరిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ ఏడాది మాత్రం లీగ్‌ దశలోనే ని్రష్కమించింది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి గురువారమే సెమీఫైనల్‌ రేసు నుంచి తప్పుకున్న ఈ ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శుక్రవారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచి ఊరట చెందింది. ప్రపంచ ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా)తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ సింధు 21–19, 21–19తో గెలిచింది. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో ఒకదశలో 9–18తో వెనుకబడటం గమనార్హం. ఈ దశలో సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి స్కోరును 18–18తో సమం చేసింది. ఆ తర్వాత హి బింగ్‌జియావో ఒక పాయింట్‌ నెగ్గగా... ఆ వెంటనే సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను దక్కించుకుంది.

రెండో గేమ్‌ ఆరంభంలోనే సింధు 5–2తో ఆధిక్యంలోకి వెళ్లిం ది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2019 సీజన్‌ను విజయంతో ముగించింది. రెండేళ్ల తర్వాత హి బింగ్‌జియావోపై సింధు గెలుపొందడం విశేషం. చివరిసారి 2017 వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లోనే ఆమెపై నెగ్గిన సింధు గత రెండేళ్ల వ్యవధిలో ఈ చైనా ప్లేయర్‌ చేతిలో నాలుగుసార్లు ఓడిపోయింది. ఓవరాల్‌గా హి బింగ్‌జియావోతో ముఖాముఖి రికార్డులో సింధు 6–9తో వెనుకంజలోనే ఉండటం గమనార్హం. 2016లో తొలిసారి వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోరీ్నకి అర్హత పొందిన సింధు ఆ ఏడాది సెమీస్‌లో ని్రష్కమించింది. 2017లో రన్నరప్‌గా నిలిచి, 2018లో విజేతగా అవతరించింది. ఈసారి తన గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి ని్రష్కమించిన సింధుకు 16,500 డాలర్ల (రూ. 11 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 

►17 ఈ ఏడాది సింధు ఆడిన టోరీ్నలు. సుదిర్మన్‌ కప్‌లోనూ సింధు ఆడినా అది టీమ్‌ ఈవెంట్‌ కాబట్టి టోర్నీల జాబితాలో తీసుకోలేదు. సుదిర్మన్‌ కప్‌లో సింధు ఒక మ్యాచ్‌ ఆడి గెలిచింది

►14 ఈ ఏడాది సింధును ఓడించిన వేర్వేరు దేశాల క్రీడాకారిణులు. అకానె యామగుచి, నొజోమి ఒకుహారా (జపాన్‌), సుంగ్‌ జీ హున్, యాన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా), చెన్‌ యుఫె, హి బింగ్‌జియావో, కాయ్‌ యాన్‌ యాన్‌ (చైనా), తై జు యింగ్, పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ), బుసానన్, పోర్న్‌పవీ, నిచావోన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌), కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), బీవెన్‌ జాంగ్‌ (అమెరికా). యామగుచి మూడుసార్లు, సుంగ్‌ జీ హున్‌ రెండుసార్లు సింధుపై నెగ్గగా... మిగతా వాళ్లు ఒక్కోసారి ఓడించారు.

►48 ఈ సంవత్సరం సింధు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య. ఇందులో సింధు 31 మ్యాచ్‌ల్లో గెలిచింది. 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

►108 ఈ ఏడాది సింధు ఆడిన మొత్తం గేమ్‌ల సంఖ్య. ఇందులో ఆమె 68 గేముల్లో గెలిచింది. 40 గేమ్‌లను చేజార్చుకుంది.

►3839  ఈ ఏడాది సింధు ఆడిన మొత్తం పాయింట్ల సంఖ్య. ఇందులో సింధు ప్రత్యర్థులపై 2053 పాయింట్లు సాధించింది. 1786 పాయింట్లను ప్రత్యర్థులకు కోల్పోయింది.   

మరిన్ని వార్తలు