కరోనా లాక్‌డౌన్‌: ‘ఖైదీననే భావన కలుగుతోంది’

7 Apr, 2020 10:51 IST|Sakshi

ఢాకా: మహమ్మారి కరోనా వైరస్‌కు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేయడానికి అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు రెక్కలు తొడిగిన పక్షుల్లా ఇష్టానుసారంగా విహరించిన ప్రజలు లాక్‌డౌన్‌తో స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొందరు ఆస్వాదిస్తుండగా మరికొంతమంది లాక్‌డౌన్‌ను గడ్డుకాలంగా భావిస్తున్నారు.

బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ లిటన్‌ దాస్‌ కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని చాలా కష్టంగా అనుభవిస్తున్నట్లు తెలిపాడు.  ‘లాక్‌డౌన్‌ సమయంలో మీరు ఇంటి నుంచి బయటకి వెళుతున్నారా? అయితే నా పరిస్థితి మీకు అర్థం కాదు. ఎటూ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటుండటంతో నేనొక ఖైదీననే భావన కలుగుతోంది. ఈ లాక్‌డౌన్‌లో తినడం, పడుకోవడం, సినిమాలు చూడటం తప్ప మరొకటి చేయడం లేదు. వీటితోపాటు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) సూచనలను పాటిస్తున్నాను. 

ఇక నా భార్య పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఆమె కుడి చేతికి గాయాలయ్యాయి. దేవుడి దయవల్ల ప్రస్తుతం బాగానే ఉంది. ఈ ప్రమాదం తర్వాత సిలిండర్‌, పైపులు, బర్నర్స్‌ మార్చాను.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌ అనే అంశం నా ఆలోచనల్లో ఏ మాత్రం లేదు. ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో ఉంది. మనం కరోనా బారి నుంచి మనుగడ సాగించగలిగితే అప్పుడు ఆడటం లేక మరొకటి చేయగలుగుతాం. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నా ఇది క్రికెట్‌ సమయం కాదు’ అంటూ లిటన్‌ దాస్‌ పేర్కొన్నాడు. 

చదవండి:
విషమంగా బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్యం
కరోనా వైరస్‌: త్రిముఖ వ్యూహం..

>
మరిన్ని వార్తలు