ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 30,000 మంది..

6 Jun, 2020 08:58 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా క్రీడా లోకం పూర్తిగా స్తంభించిపోయింది. మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ జరగలేదు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కాస్త కొలుకొని క్రీడా కార్యకలాపాలను కొన్ని దేశాలు పునరుద్దరిస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం తక్కువగా ఉన్న వియత్నాం అన్ని దేశాల కంటే వేగంగా భారీ సంఖ్యలో అభిమానులతో తొలి ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి దాదాపు 30,000 ఫుట్‌బాల్‌ ప్రేమికులు హాజరైనట్లు స్టేడియం అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు హాజరు కాగా ఎవరు కూడా భౌతిక దూరం పాటించలేదు. అధికారులు కూడా స్టేడియంలో అభిమానులు భౌతిక దూరం పాటించేలా ఎలాంటి మార్కింగ్‌లు కూడా ఏర్పాటు చేయనట్లు తెలుస్తోంది. (వేచి చూద్దాం!)

అంతేకాకుండా ముఖానికి మాస్క్‌లు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ధరించారు. అయితే మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు, శానిటైజేషన్‌ చేసినట్లు స్టేడియం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఫుట్‌బాల్‌ ప్రేమికుడు మాట్లాడుతూ..‘ఇన్ని రోజులు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడకుండా ఉంటే పిచ్చెక్కిపోయింది. కరోనా భయం ఉంటే మ్యాచ్‌లు చూడటానికి రాకండి. అంతేకాని మ్యాచ్‌లు జరగకుండా అడ్డుకోకండి’ అంటూ పేర్కొన్నాడు. వియత్నాంలో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం సంభవించనప్పటికీ 328 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక త్వరలోనే ఇంగ్లండ్‌, స్పెయిన్‌ వంటి దేశాలు కూడా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే జర్మనీలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. (‘ధోని మాటకు చిర్రెత్తుకొచ్చింది’)

మరిన్ని వార్తలు