సెయింట్ లూసియా:ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు మరింత ఆదరణ పెరుగుతోంది. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఎంతటి క్రేజ్ ఉందో, వెస్టిండీస్లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) కూడా దాదాపు అదే స్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తాజాగా సీపీఎల్ నిర్వహకులు విడుదల చేసిన గణాంకాలు ఆ లీగ్ పట్ల ఆదరణను చెబుతున్నాయి. ఈ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా134 మిలియన్లు(దాదాపు 11 కోట్లు)మంది ప్రేక్షకులు సీపీఎల్ ను వీక్షించారు. ఇది కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధికం కావడం విశేషం.
ఇది గతేడాది కంటే 44 శాతం అధికమని సీపీఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ తరహాలో ఆదరణ పెరగడానికి అమెరికా తో పాటు, యూకే, భారత్, మిడిల్ ఈస్ట్ దేశాల ప్రేక్షకులే కారణమన్నారు. తమ దేశంలో జరిగే ఒక క్రికెట్ లీగ్ కు ఇంతటి స్థాయిలో ఆదరణ లభించడం చాలా గర్వంగా ఉందని సీపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డామెన్ ఓ డొనోహో తెలిపారు. ఇది తాము గర్వపడే రోజుగా డామెన్ అభివర్ణించారు. 2103లో ఈ లీగ్ను 36 మిలియన్లు మంది వీక్షించగా, 2014లో రికార్డు స్థాయిలో 66 మిలియన్లు మందిని ఆకట్టుకుంది. గతేడాది 93 మిలియన్ల మంది కరీబియన్ ప్రీమియర్ లీగ్ను వీక్షించారు.