2018.. పరుగుల కింగ్‌ కోహ్లినే

27 Dec, 2018 16:59 IST|Sakshi

గతేడాది జరిగిన సిరీస్‌ల్లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్‌ జట్టు.. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు నమోదు చేసింది. ప్రధానంగా స్వదేశంలో ఘన విజయాల్ని సాధించిన టీమిండియా..  విదేశీ పర్యటనల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైంది.  ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్న విరాట్‌ సేన..  వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆటగాళ్ల ర్యాంకు పరంగా చూస్తే బ్యాటింగ్‌ విభాగంలో విరాట్‌ కోహ్లి టెస్టులతో పాటు, వన్డేల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వన్డే బౌలింగ్‌ విభాగంలో బూమ్రా టాప్‌లో ఉన్నాడు.

1. దక్షిణాఫ్రికా పర్యటన
: ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను చేజార‍్చుకుంది. భారత జట్టు 1-2  తేడాతో సఫారీల చేతిలో ఓటమి పాలై సిరీస్‌ను సమర్పించుకుంది. వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్‌.. చివరి టెస్టులో మాత్రం గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఆపై వన్డే సిరీస్‌ను భారత్‌ 5-1తో కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 10న జరిగిన నాలుగో వన్డేలో మినహా అన్నింటిల్లోనూ భారత్‌ విజయాలు నమోదు  చేసింది. నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. టీ 20 సిరీస్‌లోనూ భారత్‌ 2-1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్త చేసింది. 

2. నిదహాస్‌ ట్రై సిరీస్‌: శ్రీలంక వేదికగా మార్చి నెలలో జరిగిన నిదహాస్‌ ట్రై సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంక, భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌ ఈ సిరీస్‌లో పాల్గొంది. 

3. అఫ్గాన్‌తో ఏకైక చారిత్రాత్మక టెస్ట్‌లో భారత్‌ విజయం(జూన్‌ 14 నుంచి 18 వరకు జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 26 పరుగుల తేడాతో టీమిండియా విజయం). ఈ టెస్టు మ్యాచ్‌కు అజింక్యా రహానే నేతృత్వం వహించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏకపక్ష విజయం సాధించింది. 

4. ఐర్లాండ్‌ రెండు టీ20ల సిరీస్‌: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్‌ 2-0 తో క్లీన్‌స్వీప్‌ చేసింది.  జూన్‌27వ తేదీన జరిగిన తొలి టీ20లో భారత్‌ 76 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టీ20లో 143 పరుగులతో జయభేరి మోగించింది. 

5. ఐర్లాండ్‌ సిరీస్‌ ముగించుకుని ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌కు శుభారంభం లభించింది. టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది. అటు తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 1-2తో కోల్పోయింది. తొలి వన్డేలో గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేల్లో భారత్‌ ఓటమి పాలై సిరీస్‌ను సమర్పించుకుంది. ఇక టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టెస్టు సిరీస్‌లో భారత్‌ 4-1తో కోల్పోయింది. ఆగస్టు 18 నుంచి 22 వరకూ నాటింగ్‌హమ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

6. ఆసియాకప్‌ భారత్‌ కైవసం:  దుబాయ్‌ వేదికగా ఆరు దేశాల పాల్గొన్న ఆసియాకప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించిన భారత్‌ కప్‌ను ముద్దాడింది. పాకిస్తాన్‌,అఫ్గానిస్తాన్‌లు సూపర్‌-4 దశతోనే సరిపెట్టుకోగా, శ్రీలంక లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.

7. విండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌: సెప్టెంబర్‌ చివరి వారంలో భారత్ పర్యటనకు వచ‍్చిన విండీస్‌ టెస్టు సిరీస్‌తో పాటు వన్డే, టీ20 సిరీస్‌ను కోల్పోయి స‍్వదేశానికి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 క్లీన్‌స్వీస్‌ చేసిన భారత్‌.. ఐదు వన్డేల సిరీస్‌ 3-1తో సాధించింది. రెండో వన్డే టైగా ముగియగా, మూడో వన్డేలో విండీస్‌ విజయం నమోదు చేసింది. ఇక మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

8. ఆసీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌: ఆసీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా టీ20 సిరీస్‌ను ఆడింది. నవంబర్‌ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలవగా, రెండో టీ20 వర్షం వల్ల రద్దయ్యింది. దాంతో సిరీస్‌ సమం అయ్యింది. ఆపై నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ ‌6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ జరిగిన తొలి టెస్టులో భారత్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, డిసెంబర్‌ 14వ తేదీ నుంచి 18 వరకూ జరిగిన రెండో టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. 

9. గౌతం గంభీర్‌ రిటైర్మెంట్‌:  టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ రంజీ ట్రోఫీ మ్యాచే గంభీర్‌కు చివరిది. 2016లో ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌ ఆడిన గంభీర్‌.. చివరి వన్డేను 2013లో ఇంగ్లండ్‌తోనే ఆడాడు.

10. రిషబ్‌ పంత్‌: ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన టీమిండియా యువ కీపర్‌ రిషబ్‌ పంత్ అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు క్యాచ్‌లను అందుకున్న నాల్గో భారత కీపర్‌గా గుర్తింపు పొందాడు.  మరొకవైపు ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్‌ కీపర్‌గా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇటీవల ఆసీస్‌తో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రిషభ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో రిషభ్‌ పట్టిన క్యాచ్‌లు 11. ఫలితంగా టీమిండియా తరుఫున ఇప్పటివరకూ సాహా పేరిట ఉన్న రికార్డును రిషభ్‌ బ్రేక్‌ చేశాడు.

11. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో రికార్డు: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి అండర్‌-19 వరల్డ్‌కప్‌లో కొత్త చరిత్రను లిఖించింది. పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు.. పటిష్టమైన ఆసీస్‌ను మట్టికరిపించి కప్‌ను సగర్వంగా అందుకుంది. ఈ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆరుసార్లు ఫైనల్‌కు చేరిన భారత్‌.. నాలుగుసార్లు విజేతగా నిలిచింది.  ఈ ఓవరాల్‌ టోర్నీలో అత్యధిక సార్లు కప్‌ల జాబితా ప్రకారం భారత్‌ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ ఆసీస్‌ మూడు వరల్డ్‌కప్‌లతో రెండో స్థానంలో ఉంది. 

12. పృథ్వీ షా రికార్డులు: ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా యువ కెరటం పృథ్వీషా పలు రికార్డులు సాధించాడు. భారత్‌ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. మరొకవైపు పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు.  18 ఏళ్ల 329 రోజుల వయసులోనే షా ఈ ఘనత సాధించాడు. అంతకుముందు సచిన్‌ టెండూల‍్కర్‌ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్‌ సెంచరీ సాధించిన మూడో ఓవరాల్‌ క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు సాధించాడు.

13. మిథాలీ-పొవార్‌ల వివాదం: మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్‌ రమేశ్‌ పవార్‌, మాజీ కెప్టెన్‌, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్‌ డయానా ఎడుల్జీల హస్తం ఉందని సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్‌ రమేశ్‌ పొవార్‌ వ్యవహరించారని మిథాలీ పేర్కొంది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తర్వాత అవమానకర రీతిలో తనతో ప్రవర్తించారని హైదరాబాద్‌ ప్లేయర్‌ కన్నీళ్లపర్యంతమైంది. కాగా, ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్‌ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని మిథాలీ రాజ్‌ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో పవర్‌ తెలపడం మరింత అగ్గి రాజేసింది. ఇక్కడ మరొకసారి పొవార్‌ను కోచ్‌గా నియమించాలంటూ టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కోరడం కొసమెరుపు.

14. పరుగుల కింగ్‌ కోహ్లినే: ఈ ఏడాది డిసెంబర్ 27 వరకు లెక్కలు తీసుకుంటే టెస్టుల్లో విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2018లో 13 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 23 ఇన్నింగ్స్‌లకు గాను 1322 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన ఏకైక టెస్ట్ బ్యాట్స్‌మన్ కోహ్లి. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లినే తొలి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 14 వన్డేలు ఆడిన భారత కెప్టెన్.. 1202 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. . మరొకవైపు విదేశాల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇక టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 128 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించి సచిన్‌ రికార్డును(130 ఇన్నింగ్స్‌లు) బ్రేక్‌ చేశాడు.

మరిన్ని వార్తలు