24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌లో క్రికెట్‌!

13 Aug, 2019 15:54 IST|Sakshi

దుబాయ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో మళ్లీ క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి లైన్‌క్లియర్‌ అయ్యింది.  మహిళల క్రికెట్‌ను ఓ అంశంగా చేర్చడానికి కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) ఆమోద ముద్ర వేసింది. కొన్ని రోజుల క్రితమే కామన్వెల్త్‌లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చడానికి అంగీకారం తెలిపిన సీజీఎఫ్‌.. మంగళవారం దాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా నిర్వహించే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌నూ ఓ అంశంగా చేరుస్తూ సీజీఎఫ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ), ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి ఆమోదించిన సంగతి తెలిసిందే. 

‘ఇది మహిళా క్రికెట్‌ విశ్వవ్యాప్తం కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్నే తెలిపారు. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను ఓ క్రీడాంశంగా చేర్చారు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. అప్పుడు సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, జాక్వస్‌ కల్లిస్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌ ఎప్పుడూ భాగం కాలేదు.

మరిన్ని వార్తలు