ఐపీఎల్‌ 12: ఆధిపత్యం ఎవరిదో?

9 Apr, 2019 19:36 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌  టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. తొలుత కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలు నమోదు చేశాయి. బలాబలాల్లో ఇరు జట్లూ సమంగానే కనిపిస్తున్నప్పటికీ ఒంటిచేత్తే కేకేఆర్‌కు విజయాలు సాధించిపెడుతున్న ఆల్‌రౌండర్, హార్డ్‌ హిట్టర్‌ రసెల్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంది.  

ప్రస్తుత ఐపీఎల్‌లో నాణ్యమైన స్పిన్‌ విభాగం కేకేఆర్, సీఎస్‌కే సొంతం. కోల్‌కతా తరఫున కుల్‌దీప్‌ యాదవ్, సునీల్‌ నరైన్, పీయూష్‌ చావ్లా ప్రత్యర్థి ఆటగాళ్లకు ముకుతాడు వేస్తుండగా, చెన్నై తరఫున ఆ బాధ్యతను వెటరన్‌ హర్భజన్, ఇమ్రాన్‌ తాహిర్, రవీంద్ర జడేజా సమర్థంగా నెరవేరుస్తున్నారు. మ్యాచ్‌ జరగనున్న చెపాక్‌ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో రెండు జట్లూ తమ స్పిన్‌ త్రయాలతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏ జట్టు స్పిన్‌ త్రయానిది పై చేయి కానుందో చూడాలి. కాగా, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆ తర్వాత ముంబై చేతిలో ఓడినప్పటికీ శనివారం కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ విజయాల బాట పట్టింది. కోల్‌కతా కూడా సమష్టి పోరాటంతో విజయాలు సాధిస్తుండటంతో ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో  ఏ జట్టు గెలిచి ఆధిక్యంలో నిలుస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు