వాటే ఏ త్రో కమిన్స్‌..

6 Dec, 2018 16:58 IST|Sakshi

అడిలైడ్‌: ఆసీస్‌తో మొదలైన తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు చతేశ్వర పూజారా సెంచరీ కొట్టేశాడు. వరుసగా టాపార్డర్ వికెట్లు పడిపోతున్న తరుణంలో  ఒంటరి పోరాటం చేసిన పుజారా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఆసీస్ బౌలర్లను సహనంతో ఎదుర్కొని తన కెరీర్‌లో 16వ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ దాటిన తర్వాత దూకుడు పెంచిన పూజారా... 246 బంతులు ఆడి 123 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాట్ కమిన్స్ చేతులమీదుగా రనౌట్‌కు గురైయ్యాడు.

అప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు విసుగుతెప్పించిన పూజారాను ఔట్‌ చేసేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే కమిన్స్‌ చేసిన అద్భుతమైన రనౌట్‌తో పుజారా తొమ్మిదో వికెట్‌గా నిష్ర్రమించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా హజల్‌వుడ్‌ వేసిన 88 ఓవర్‌లో ఐదో బంతిని పుజారా షార్ట్‌ మిడ్‌వికెట్‌లోకి తరలించాడు. అదే సమయంలో  సింగిల్‌ తీసేందుకు యత్నించాడు. కాగా, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కమిన్స్‌ గాల్లో డైవ్‌ కొడుతూనే బంతిని గురి తప్పకుండా వికెట్లపైకి విసిరాడు. ఫలితంగా పుజారా ఇన్నింగ్స్‌ ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పుజారా ఆదుకోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది.

>
మరిన్ని వార్తలు