కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా 364 పరుగుల లక్ష్యాన్ని లంకకు నిర్దేశించింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది.
భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు.