కామన్వెల్త్‌లో భారత్ రౌండప్

2 Aug, 2014 02:17 IST|Sakshi

 టేబుల్ టెన్నిస్
 పతకం ఖాయం
 పురుషుల డబుల్స్‌లో ఆచంట శరత్ కమల్-ఆంథోనీ అమల్‌రాజ్ జోడి ఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో శరత్-ఆంథోని 11-7, 12-10, 11-3తో యాంగ్ జి-జియాన్ (సింగపూర్)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో శరత్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. పాల్ డ్రింక్‌హాల్ (ఇంగ్లండ్)తో జరిగిన క్వార్టర్స్‌లో శరత్ 11-7, 11-6, 12-10, 9-11, 11-6తో నెగ్గాడు. సౌమ్యజిత్ ఘోష్ క్వార్టర్‌ఫైనల్లో 11-7, 7-11, 11-9, 7-11, 10-12, 9-11తో పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు.
 
 జిమ్మాస్టిక్స్
 ఆశిష్ దురదృష్టం
 
 భారత జిమ్నాస్ట్ ఆశిష్ కుమార్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో కొద్దిలో పతకం చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన వాల్ట్ ఫైనల్లో తొలి ప్రయత్నంలో 14.333 స్కోరు నమోదు చేసిన ఆశిష్... రెండో ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి కిందపడ్డాడు. దీంతో ఈ ప్రయత్నంలో స్కోరును ‘0’గా నమోదు చేశారు. ఫలితంగా 7.166 సగటు మాత్రమే నమోదై 8వ స్థానానికి పడిపోయాడు. తొలి స్కోరుకు అటు ఇటుగా రెండోసారి స్కోరు చేసినా ఆశిష్‌కు కనీసం కాంస్యం దక్కేదే. ఎందుకంటే కాంస్యం నెగ్గిన వా టూన్ హో (సింగపూర్) సగటు 14.195 మాత్రమే. కాగా, 14.733తో మోర్గాన్ (కెనడా) స్వర్ణం, 14.999తో థామస్ (ఇంగ్లండ్) రజతం గెలుచుకున్నారు.
 

మరిన్ని వార్తలు