సైబరాబాద్‌ చార్జర్స్‌ ఘనవిజయం

29 Feb, 2020 10:02 IST|Sakshi

తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ లో సైబరాబాద్‌ చార్జర్స్‌ జట్టు ఘన విజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సైబరాబాద్‌ చార్జర్స్‌ 36–24తో గద్వాల్‌ గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. 11 రైడ్‌ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చార్జర్స్‌ రైడర్‌ రాజ్‌ కుమార్‌ ‘బెస్ట్‌ రైడర్‌’ అవార్డును అందుకున్నాడు. ప్రత్యర్థి రైడర్లను పట్టేసిన చార్జర్స్‌ రైడర్‌ శ్రీ కృష్ణ (4 పాయింట్లు) ‘బెస్ట్‌ డిఫెండర్‌’గా నిలిచాడు. ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన చార్జర్స్‌ విరామ సమయానికి 16–11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో మరింత చెలరేగిపోయిన రాజ్‌ కుమార్‌ తన రైడ్‌లలో పాయింట్లు తెస్తూ వచ్చాడు.   

నల్లగొండ ఈగల్స్‌ గెలుపు 
మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్‌ 42–31తో రంగారెడ్డి రైడర్స్‌పై గెలుపొందింది. ఈగల్స్‌ రైడర్‌ మల్లికార్జున్‌ 19 పాయింట్లతో చెలరేగగా... అతనికి సహచర ఆటగాడు జీవ గోపాల్‌ (5 పాయింట్లు) తన ట్యాక్లింగ్‌తో ప్రత్యర్థి రైడర్లను పట్టేసి తోడ్పాటు అందించాడు. విరామ సమయానికి ఈగల్స్‌ 13–18తో వెనుకంజలో ఉండగా... అనంతరం మల్లికార్జున్, జీవ గోపాల్‌ చెలరేగడంతో జట్టు విజయం ఖాయమైంది. మల్లికార్జున్‌కు ‘బెస్ట్‌ రైడర్‌’ అవార్డు, గోపాల్‌కు ‘బెస్ట్‌ డిఫెండర్‌’ అవార్డు లభించాయి.   

మరిన్ని వార్తలు