‘నేను పిచ్చి పనిచేస్తే మళ్లీ క్రికెట్‌ ఆడలేను’

20 Mar, 2020 12:37 IST|Sakshi

కరాచీ: కరోనా వైరస్ ప్రభావంతో దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ కొన్ని గంటల పాటు పాకిస్తాన్‌లోని ఓ హోటల్‌ నిర్బంధంలో ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్) ఆడేందుకు అక్కడికి వెళ్లిన స్టెయిన్‌‌.. ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ నాకౌట్‌కు చేరలేదు. దాంతో స్టెయిన్‌ స్వదేశానికి పయనం కావాల్సి ఉంది. ముందు జాగ్రత్తగా టోర్నీలో ప్లే ఆఫ్ చేరిన టీమ్స్‌లోని ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహించింది. విదేశీ ఆటగాళ్లకు నెగటివ్ అని తేలితేనే ప్రయాణానికి అనుమతిచ్చింది. పరీక్షలకు పంపిన శాంపిల్స్ రిపోర్ట్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ క్రికెటర్లని హోటల్ గదులకే పరిమితం చేసింది.(కరోనా విజృంభణ: ఇటలీ వీధులు వెలవెల)

‘ఆటగాళ్లందరం హోటల్ నిర్భంధంలో ఉండిపోయాం. హోటల్ దాటి వీధుల్లోకి రాకూడదని మాకు ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా ఈ నిబంధనల్ని అతిక్రమించాలనిపించలేదు. ఒకవేళ నేను ఏదైనా పిచ్చి పని చేసినా.. ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్‌లో క్రికెట్‌ ఆడలేను. నేను అందరికీ ఒకటే చెబుతున్నా ఎవరు కూడా వీధుల్లో తిరగకండి.. మీరు తిరగాలనుకునే వీధులు బాగున్నా సరే బయటకి వెళ్లవద్దు’ అని  ఈసీపీన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ లీగ్‌ దశలో మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న పీఎస్‌ఎల్‌ తాజా సీజన్‌లో ఇంకా సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. (భారత్‌లో 209కి చేరిన కరోనా కేసులు )

మరిన్ని వార్తలు