ముంబైను ముంచేసిన ఢిల్లీ

20 May, 2018 20:10 IST|Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన అమీతుమీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టు ఢిల్లీ కాగా, తాజాగా ముంబై ఇండియన్స్‌ ముంచేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు.

ఢిల్లీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఆదిలోనే సూర్యకుమార్‌ యాదవ్‌(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఎవిన్‌ లూయిస్‌(48; 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అతనికి అవతలి ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. ఇషాన్‌ కిషన్‌(5), పొలార్డ్‌(7), రోహిత్‌ శర్మ(13), కృనాల్‌ పాండ్యా(4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ముంబై 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై హార్దిక్‌ పాండ్యా(27) కాసేపు మెరుపులు మెరిపించి ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.ఇక చివర్లో బెన్‌ కట్టింగ్‌(37‌) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి వికెట్‌గా బూమ్రా ఔట్‌ కావడంతో ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్లలో లామ్‌చెన్‌, అమిత్‌ మిశ్రా, హర్షల్‌ పటేల్‌లు తలో మూడేసి వికెట్లతో సత్తాచాటగా, ట్రెంట్‌ బౌల్ట్‌ వికెట్‌ దక్కింది.

>
మరిన్ని వార్తలు