అలిగి మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయాడు!

27 Oct, 2018 15:24 IST|Sakshi

సిడ్నీ : బాల్‌ ట్యాంపరింగ్‌తో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్లెడ్జింగ్‌తో మరోసారి అసహనానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఇదే స్లెడ్జింగ్‌కు బలైన వార్నర్‌ 12 నెలల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సిడ్నీగ్రేడ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ పాల్పడటంతో చికాకు గురైన వార్నర్‌ అసహనంతో మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయాడు. అనంతరం తన సహచర ఆటగాళ్లు బతిమాలడంతో తిరుగొచ్చి సెంచరీ బాదాడు.

గత శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. ఈ మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు పాల్పడింది బౌన్సర్‌ తగిలి మరణించిన ఫిలిఫ్‌ హ్యూస్‌ సోదరుడు జాసన్‌ హ్యూస్‌గా ఆసీస్‌ మీడియా గుర్తించింది. అతడు డేవిడ్‌ వార్నర్‌ను అవమానించడాన్ని.. దీంతో అసహనం వ్యక్తం చేసిన వార్నర్‌ ఏం మాట్లాడకుండా మైదానం వీడాడని పేర్కొంది. ఇక వార్నర్‌ చర్య పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వార్నర్‌కు మద్దతిస్తుండగా.. మరికొందరు అతని చర్యను తప్పుబడుతున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం.. వార్నర్‌తో పాటు స్టీవ్‌ స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం పడేటట్లు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు