సెహ్వాగ్ ఒకే.. యువ సంచలనాన్ని ఎలా మరిచారు?

1 Nov, 2017 17:58 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్ : భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఇక్కడ జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే డీడీసీఏ చేసిన పెద్ద తప్పిదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులు సాధించాడంటూ కొన్ని ఘనతలపై ఏర్పాడు చేసిన బోర్డులో డీడీసీఏ పెద్ద తప్పిదం చేసింది. 'భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యామ్స్ మెన్ సెహ్వాగ్' అంటూ రాశారు. కానీ కరుణ్ నాయర్ ను డీడీసీఏ మరిచిపోవడం దుమారం రేపింది. భారత్ నుంచి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించింది ఇద్దరు క్రికెటర్లు కాగా, తొలి ఆటగాడు సెహ్వాగ్, రెండో ఆటగాడు కరుణ్ నాయర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందులోనూ ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కూడా ఐపీఎల్ లో ఢిల్లీ (ఢిల్లీ డేర్ డెవిల్స్) జట్టుకే ప్రాతినిధ్యం వహించినా అతడ్ని డీడీసీఏ ఎలా మరిచిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. 

టెస్టుల్లో రెండు సార్లు సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. యువ సంచలనం కరుణ్ నాయర్ 2016లో చెన్నైలోని చిదంబరం స్డేడియంలో ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టెస్టులో 303 పరుగులు చేసిన విషయాన్ని యావత్ భారత దేశ క్రికెట్ ప్రేమికులు గుర్తించుకోగా.. డీడీసీఏకు మాత్రం ఈ విషయం లెక్కలోకి రాదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చురకలంటించారు.
 

మరిన్ని వార్తలు