రాణించిన డివిలియర్స్‌, మొయిన్‌

15 Apr, 2019 21:50 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ ఆదిలోనే విరాట్‌ కోహ్లి(8) వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో పార్థీవ్‌ పటేల్‌కు జత కలిసిన ఏబీ డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత పార్థీవ్‌(28) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై డివిలియర్స్‌-మొయిన్‌ అలీల జోడి దూకుడుగా ఆడింది. ఈ జోడి పోటీ పడి పరుగులు సాధించింది. అయితే 32 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించిన తర్వాత మొయిన్‌ అలీ ఔటయ్యాడు.

ఈ క్రమంలోనే మొయిన్‌-డివిలియర్స్‌ల జోడి 95 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇక స్టోయినిస్‌ విఫలం చెందగా, డివిలియర్స్‌ 51 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేసిన తర్వాత రనౌట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. చివరి ఓవర్‌లో డివిలియర్స్‌ ఔటైన తర్వాత అక్ష్‌దీప్‌ నాథ్‌, పవన్‌ నేగీలు ఔటయ్యారు. దాంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లసిత్‌ మలింగా నాలుగు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, బెహ్రాన్‌డార్ఫ్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు