మరో సిరీస్‌కు డివిలియర్స్‌ దూరం

18 Jan, 2017 01:46 IST|Sakshi
మరో సిరీస్‌కు డివిలియర్స్‌ దూరం

రిటైర్మెంట్‌ ఆలోచన లేదన్న దక్షిణాఫ్రికా స్టార్‌

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ టెస్టు కెరీర్‌ మరోసారి సందేహంలో పడింది. వచ్చే మార్చిలో న్యూజి లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని అతను ప్రకటించాడు. సరిగ్గా ఏడాది క్రితం తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన ఏబీ, మోచేతి గాయం కారణంగా మూడు టెస్టు సిరీస్‌లలో పాల్గొనలేదు. గత ఏడాది  ఆగస్టు నుంచి అతను పూర్తిగా ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే తాను టెస్టుల నుంచి రిటైర్‌ కావడం లేదని కూడా అతను ధ్రువీకరించాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా  ఈ ఫార్మాట్‌కు ప్రస్తుతం దూరంగా ఉంటున్నట్లు డివిలియర్స్‌ చెప్పాడు. ఈ నెల 25న శ్రీలంకతో జరిగే టి20 మ్యాచ్‌తో అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. ‘నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అందువల్ల జాగ్రత్తగా మ్యాచ్‌లను ఎంచుకోవాల్సి ఉంది. కాబట్టి టెస్టులు ఆడటం లేదు. నా ప్రధాన లక్ష్యం 2019 ప్రపంచ కప్‌ గెలవడం’ అని అతను చెప్పాడు.

మరిన్ని వార్తలు