ప్రియమైన భారత్‌... ఇది నా జట్టు... వీళ్లు నా కుర్రాళ్లు 

12 Sep, 2019 03:55 IST|Sakshi

కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి భావోద్వేగ ట్వీట్‌

న్యూఢిల్లీ: ‘ఫిఫా’ 2022 ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఖతర్‌ను నిలువరించడం పట్ల భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దోహాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌ 0–0తో డ్రాగా ముగిసింది. భారత్‌కు ఒక పాయింట్‌ లభించింది. జ్వరం కారణంగా ఛెత్రి ఈ మ్యాచ్‌ ఆడకున్నా మన జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మెరుగైన, ఆసియా చాంపియన్‌ ఖతర్‌ను నిలువరించింది.

దీనిపై ఛెత్రి స్పందిస్తూ... ‘ప్రియమైన భారత్, ఇది నా జట్టు, వీళ్లు నా కుర్రాళ్లు. గర్వకారణ ఈ క్షణాలను మాటల్లో వరి్ణంచలేను. పాయింట్ల పట్టిక ప్రకారం ఇది పెద్ద ఫలితం కాకపోవచ్చు. పోరాటంలో దేనికీ తీసిపోదు. జట్టు, కోచింగ్‌ సిబ్బందిదే ఈ ఘనతంతా’ అని ట్వీట్‌ చేశాడు. ఖతర్‌తో మ్యాచ్‌లో భారత్‌కు గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు సారథ్యం వహించాడు. ప్రత్యర్థి గోల్‌ ప్రయత్నాలను అతడు సమర్థంగా అడ్డుకున్నాడు. కోచ్‌ ఇగర్‌ స్టిమాక్‌ సైతం ఈ ఫలితంతో పట్టరాని సంతోషంతో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఆడాలని కుర్రాళ్లకు సూచించాడు.

మరిన్ని వార్తలు