అభిమానులకు ‘ప్రేమతో’..

26 Aug, 2019 13:10 IST|Sakshi

ఆంటిగ్వా:  సుమారు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో శతకం సాధించడంపై టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 17 టెస్టు మ్యాచ్‌ల అనంతరం సెంచరీ నమోదు చేయడంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. వెస్టిండీస్‌పై సాధించిన ఈ సెంచరీ వెరీ వెరీ స్పెషల్‌ అంటూ ఉబ్బితబ్బి అయిపోతున్నాడు. ‘ 17 టెస్టు మ్యాచ్‌ల తర్వాత సెంచరీ చేయడంతో చాలా ఆనందంగా ఉంది. 70 నుంచి 80 పరుగుల మధ్యలో పరుగులు చేస్తున్నా రెండేళ్ల నుంచి నాకు టెస్టు సెంచరీ లేదు.

సుదీర్ఘ విరామం తర్వాత సెంచరీ చేయడం వెలకట్టలేనిది. ఇది నా కష్టకాలంలో వెన్నంటే ఉన్న అభిమానులకు అంకితం ఇస్తున్నాను’అని రహానే పేర్కొన్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసిన రహానే.. రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేశాడు. భారత్‌ నాలుగు వందలకుపైగా లక్ష్యాన్ని నిర్దేశించడంలో రహానే పాత్రనే కీలకం. ఈ మ్యాచ్‌లో భారత్‌ 318 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగులకే ఆలౌట్‌ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రహానే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు.

మరిన్ని వార్తలు