నాల్గో భారత రెజ్లర్‌గా..

21 Sep, 2019 16:34 IST|Sakshi

నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత  రెజర్ల హవా కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్‌ కేటగిరీలో భాగంగా క్వార్టర్‌ ఫైనల్లో భారత రెజ్లర్‌ దీపక్‌ పూనియా విజయం సాధించాడు. ఆసక్తిని రేకెత్తించిన బౌట్‌లో దీపక్‌ పూనియా 7-6 తేడాతో కార్లోస్‌ ఈక్విర్డో(కొలంబియా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫై అయిన నాల్గో రెజ్లర్‌గా దీపక్‌ పూనియా నిలిచాడు. ఇప్పటికే వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పూనియా, రవి కుమార్‌లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు వీరు ముగ్గురు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి కాంస్యాలను గెలుచుకున్నారు.(ఇక్కడ చదవండి: బజరంగ్, రవి కంచు మోత)

ఇ​క నాన్‌ ఒలింపిక్‌ 61 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ రాహుల్‌ అవేర్‌ సెమీస్‌కు చేరాడు.  రాహుల్‌ అవేర్‌ 10-7  తేడాతో కజికిస్తాన్‌కు చెందిన కైలియెవ్‌పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన బౌట్‌లో నాల్గో సీడ్‌గా బరిలోకి దిగిన దీపక్‌ పూనియా ఎక్కడ కూడా పట్టు సడలనివ్వలేదు. కడవరకూ తన త్రోలతో ఆకట్టుకున్న పూనియా ఒక్క పాయింట్‌ తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.
 

మరిన్ని వార్తలు