న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ దీపక్ పూనియా పసిడి పతక పోరుకు అర్హత సాధించాడు. స్లొవేకియాలో జరుగుతున్న ఈ పోటీల్లో దీపక్ ఫ్రీస్టయిల్ 86 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో దీపక్ 6–2తో ఇవాన్ నెడాల్కో (మాల్డోవా)పై గెలుపొందాడు.
అంతకుముందు బౌట్లలో దీపక్ 7–0తో ప్యాట్రిక్ జురోవ్స్కీ (హంగేరి)పై, 11–0తో జాయోంగ్ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఆరిఫ్ ఓజెన్ (టర్కీ)తో దీపక్ తలపడతాడు. మరోవైపు 57 కేజీల విభాగంలో భారత్కే చెందిన నవీన్ సిహాగ్ రజతంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో నవీన్ 1–12తో అఖ్మెద్ ఇద్రిసోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు.