దీపిక ‘పసిడి’ గురి 

26 Jun, 2018 01:15 IST|Sakshi

ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నీలో స్వర్ణం

సీజన్‌ ముగింపు టోర్నీకి అర్హత  

సాల్ట్‌ లేక్‌ సిటీ (అమెరికా): ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి మరోసారి ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నీలో వ్యక్తిగత స్వర్ణం సాధించింది. సోమవారం ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీ మహిళల వ్యక్తిగత రికర్వ్‌ ఈవెంట్‌ లో ఈ జార్ఖండ్‌ అమ్మాయి విజేతగా నిలిచింది. ఫైనల్లో దీపిక 7–4తో మిచెల్లి క్రాపెన్‌ (జర్మనీ)పై గెలిచి 2012 తర్వాత ఈ టోర్నీలో పసిడి పతకం గెల్చుకుంది. దీంతో టర్కీలో ఈ ఏడాది చివర్లో జరిగే సీజన్‌ ముగింపు టోర్నీకి ఆమె అర్హత సాధించింది. మరోవైపు రికర్వ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ కాంస్య పతక పోరులో దీపిక–అతాను దాస్‌ (భారత్‌) ద్వయం 4–5తో తాంగ్‌ చి చున్‌–తాన్‌ యా టింగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడింది.  

సురేఖ ర్యాంక్‌ 10: మరోవైపు మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కెరీర్‌ బెస్ట్‌ పదో ర్యాంక్‌ను సాధించింది. ఈ ఏడాది జరిగిన మూడు ప్రపంచకప్‌ టోర్నీలలోనూ సురేఖ మిక్స్‌డ్‌ విభాగంలో కాంస్య పతకాలు గెలిచింది.    

మరిన్ని వార్తలు