అదేంటో! అలా జరుగుతోంది: రోహిత్‌ శర్మ

10 May, 2018 12:07 IST|Sakshi

కోల్‌కతా: టోర్నో ప్రారంభంలో దారుణ వైఫల్యాలను చవిచూసే ముంబై ఇండియన్స్‌... పోనుపోను పుంజుకుంటూ.. చివరికి టైటిల్‌ విజేతగా నిలుస్తుండటం పరిపాటి అయింది. మరీ ముఖ్యమంగా గడిచిన మూడేళ్లలో ఫస్ట్‌ ఆఫ్‌లో ఫ్లాప్‌ కావడం.. సెకండాఫ్‌లో హిట్‌ కావడం రివాజుగా మారింది. దీనిపై ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ‘‘అదేంటోమరి!(నవ్వులు) మే నెలలోనే మేం అద్భుతంగా రాణించడం జరుగుతోంది. గత మూడేళ్లుగా టోర్నో ద్వితియార్ధంలోనే బాగా ఆడుతున్నాం’’ అని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌ 2018లో భాగంగా బుధవారం కోల్‌కతాపై ముంబై 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ ఏమిటన్న ప్రశ్నకు రోహిత్‌ తడుముకోకుండా సమాధానం చెప్పాడు.. ‘ఇంకేంటి.. ఇషాన్‌ ఇన్నింగ్సే’ అని.

బీభత్సం సృష్టించాడు: ‘‘ఇషాన్‌ కిషన్‌ తనదైన రోజు కోసం ఎదురుచూశాడు. అతను ఆటాడిన తీరు నిజంగా అద్భుతం. వాస్తవానికి పిచ్‌ కాస్త ఇబ్బంది పెట్టింది. అయినాసరే అతను ఏమాత్రం భయపడకుండా బీభత్సం సృష్టించాడని చెప్పొచ్చు. చివర్లో బెన్‌ కట్టింగ్‌ సైతం అసాధారణంగా ఆడాడు. జట్టును ప్లేఆఫ్‌ రేసులో సజీవంగా నిలపడానికి సమిష్టిగా కృషించాం. చక్కటి ఫలితాన్ని రాబట్టగలిగాం’’ అని రోహిత్‌ చెప్పాడు. సాధారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగే ఇషాన్‌ కిషన్‌.. కోల్‌కతాతో మ్యాచ్‌లో అనూహ్యంగా 4వ స్థానంలో వచ్చాడు. దుమ్మురేపే షాట్లతో 21 బంతుల్లోనే 62 పరుగులు సాధించి మ్యాచ్‌ గతిని సమూలంగా మార్చేశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇషాన్‌ స్టన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో ముంబై 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో దారుణంగా విఫలమైన కోల్‌కతా 18.1 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది.

>
మరిన్ని వార్తలు