ఢిల్లీ అగ్రస్థానమా? నమ్మలేకపోతున్నాం!

23 Apr, 2019 11:51 IST|Sakshi

జైపూర్‌ : పేరు మార్చుకొని ఈ సీజన్‌ ఐపీఎల్‌ బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు దానికి తగ్గట్టుగానే ఆడుతూ ఊహించిన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత 11 సీజన్లలో ఇప్పటి వరకు ఈ ఫీట్‌ అందుకొని ఢిల్లీ.. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నెగ్గి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ప్రత్యర్థి ఆటగాడు అంజిక్య రహానే సెంచరీతో కదం తొక్కినా.. స్మిత్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగినా .. అదరని, బెదరని ఢిల్లీ కొండంత లక్ష్యాన్ని యువ ఆటగాళ్లు రిషభ్‌ పంత్‌, పృథ్వీషా, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ధావన్‌ల సాయంతో  సునాయసంగా చేదించింది.

దీంతో 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ విషయాన్ని ఢిల్లీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘వామ్మో ఢిల్లీ అగ్రస్థానమా? నమ్మలేకపోతున్నాం.. అని ఒకరంటే.. అప్పుడెప్పుడో ఢిల్లీ అగ్రస్థానమని చదివా.. కానీ అది కాలుష్య జాబితాలో అని తెలిసి నిట్టూర్చా. కానీ ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం అంటే నమ్మలేకపోతున్నా’ అని ఇంకొకరు కామెంట్‌ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌, జోక్స్‌తో నెట్టింట రచ్చ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు